సూక్ష్మశరీరయానం

 

“ఆత్మకు ‘చావు’ అన్నది లేదు! “ఈ సత్యాన్ని ఆత్మస్వరూపులమైన మనం అంతా కూడా ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. ఈ సత్యం తెలుసుకోలేని సగటు మానవుడు .. ఏ కడుపు నొప్పితోనో .. ఏ క్యాన్సర్ జబ్బుతోనో చనిపోయిన తరువాత .. తాను పోయాడనుకుని తన శవం ప్రక్కనే కూర్చుని ఏడుస్తూన్న భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. ”

‘నేను ఇక్కడే ఉన్నాను కదే! .. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఇప్పుడు నాకు కడుపు నొప్పీ లేదు .. క్యాన్సర్ జబ్బూ లేదు చూడు’ అంటూ .. అటూ ఇటూ ఖంగారుగా తిరుగుతూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూంటాడు.

‘అసలు నా వాళ్ళంతా ఎందుకు ఏడుస్తున్నారు?’ అని వాడికి పెద్ద సంశయం! అందరివైపు చూస్తూంటాడు కానీ .. వాడిని ఎవ్వరూ పట్టించుకోరు! ‘అయ్యో పోయాడు’ అని వాళ్ళ ఏడ్పులే వాళ్ళు ఏడుస్తూంటారు! ఎందుకంటే బ్రతికి ఉన్నవాళ్ళ కళ్ళకు చనిపోయిన వాళ్ళు కనబడరు.

“చనిపోయిన వాళ్ళకు బ్రతికి ఉన్నవాళ్ళంతా దృశ్యం అయితే .. బ్రతికి ఉన్న సగటు మానవులకు చనిపోయిన వాళ్ళంతా కూడా అదృశ్యులు! అందుకే చావును గురించీ మరి చనిపోయిన తరువాత వెళ్ళే వివిధ లోకాలను గురించీ చనిపోకముందే మనం తెలుసుకోవాలి. ధ్యానం చేసి ‘మన దివ్యనేత్రాన్ని తెరిపించుకుని’ ఆ యా లోకాలన్నీ తిరిగి .. అక్కడి విశేషాలన్నీ తెలుసుకుని రావాలి. అప్పుడే భౌతికనేత్రాలకు అదృశ్యులుగా ఉన్న వాళ్ళంతా మనకు దృశ్యులుగా కనబడతారు! వాళ్ళంతా ఏ స్థితిలో ఉన్నారో అర్థం అవుతుంది.

లేకపోతే చనిపోయిన తరువాత కూడా ఎర్త్‌బౌండ్ సోల్స్‌గా తమ పార్థివశరీరం చుట్టూ .. తమవాళ్ళ చుట్టూ .. అయోమయంగా తిరుగుతూ ఉంటారు. తాము జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న ఇళ్ళనూ, వాకిళ్ళనూ పట్టుకుని వ్రేళ్ళాడుతూ తమ సమయాన్ని .. బ్రతికి ఉన్నప్పుడే కాదు చనిపోయిన తరువాత కూడా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు.

కనుక, చనిపోకముందే .. ఎవ్వరు నవ్వినా .. ఎవ్వరు ఏడ్చినా .. తనకేమీపట్టనట్లు సరస్వతీనదీ జ్ఞాన సముపార్జన చెయ్యాలి. అలా చేసినవాడు .. ఇక్కడి తన ప్రాపంచిక కర్తవ్యాలను చక్కగా నెరవేర్చుకుని .. చనిపోయాక హాయిగా నవ్వుకుంటూ పై లోకాలకు వెళ్ళిపోతాడు!

అక్కడ అతడి కోసం ఎదురు చూస్తూన్న ఉన్నత ఆత్మలు అతడిని ఆహ్వానించి .. సేదదీరుస్తారు. ‘భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ .. ప్రతి క్షణం నిన్ను డిస్టర్బ్ చేశారు; అక్కడి సమస్యలతో నుజ్జు నుజ్జు అయ్యి ఇక్కడికి వచ్చావు .. నీ ఇష్టం ఉన్నంత కాలం ప్రప్రధమంగా విశ్రాంతి తీసుకో! ఇక్కడ ఉన్నవన్నీ చక్కగా అనుభవించు .. ఆ తరువాత మాట్లాడుకుందాం!’ అని చెబుతారు.

ఆ తరువాత అక్కడ అతడు భూలోకంలో వేటికోసమైతే నా నా అగచాట్లు పడ్డాడో అవన్నీ క్షణాలలో పొందేస్తాడు. డబ్బూ, బంగళాలూ, బంగారం, వజ్రాలూ, వైఢూర్యాలూ, నాట్యాలూ, గానాలూ, భజనలూ, పంచభక్ష్య పరమాన్నాలూ .. ఇలా ఏది తలచుకుంటే అది అతని కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూ ఉండడంతో .. అతనికి కొంతకాలానికే అక్కడి జీవితం వెగటు పుడుతుంది.

అప్పుడు మళ్ళీ ఆ ఉన్నత లోకాల మాస్టర్లను తలుచుకుని ‘ఇంకా ఇంతకంటే గొప్పవైన లోకాలు ఏవైనా ఉన్నాయా!? అక్కడ ఇంతకంటే గొప్ప విశేషాలు ఉంటాయా!?’ అంటూ ‘ఆరా’ తీస్తాడు!

దానికి వాళ్ళు ‘ఓ యబ్బ! నువ్వు చూడనివి ఇంకా లెక్కలేనన్ని లోకాలు ఉన్నాయి! మరి ఇంకా క్రొత్త క్రొత్తలోకాలు పుడుతూనే ఉంటాయి. కాకపోతే నువ్వు సంపాదించిన ఆత్మజ్ఞానానికి ఈ లోకం వరకే రాగలిగావు! ఇంతకంటే పైలోకాలకు వెళ్ళాలంటే మాత్రం నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళి .. అక్కడే కొన్ని ఛాలెంజ్‌లను ఎదుర్కుని ఇంకొంచెం ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని రావాల్సిందే’ అని తేల్చిచెబుతారు.

అలా భూలోకం, భువర్లోకం (lower Astral Universe) సువర్లోకం (Higher Astral Universe) జనాలోకం సత్యమహాలోకం (Causal Universe) తపోలోకం మరి సత్యలోకం (Supra Causal Universe) అన్నీ దాటుకుంటూ వాళ్ళు బ్రహ్మలోకం చేరుకోవాలి. అదే ఆత్మ యొక్క గమ్యం!

ఇలా ప్రతిసారీ భూమి మీద ప్రాపంచిక జీవితంలో వాళ్ళు వాళ్ళు సంపాదించుకున్న ఆత్మజ్ఞానాన్ని బట్టి వాళ్ళకు ఆ యా లోకాలలోకి ప్రవేశం లభిస్తూ ఉంటుంది! మరి ఈ లోకాలన్నీ తిరిగినప్పుడే వారికి వారి స్వీయ ఆత్మ యొక్క పరిణామక్రమం పూర్తి అవుతుంది!

ఇదంతా తెలుసుకోకుండానే భూలోకంలో తమ జన్మలను గడిపేసిన వాళ్ళంతా కూడా భూలోకంచుట్టే తిరుగుతూ .. చాలా కాలం పాటు తమ సమయాన్ని వృధాచేసుకుని .. ఆ తరువాత భువర్లోకానికి చేరుకుంటారు.

అక్కడ తాను చేసిన తప్పుని గుర్తించుకుని .. ‘ఈ సారైనా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను’ అనుకుని మళ్ళీ భూమి మీదకు వస్తారు. భూలోకంలో ‘అన్నదానం’ .. ‘గోదానం’ .. ‘భూదానం’ వంటి కాస్త గొప్ప గొప్ప పనులు చేసి సువర్లోకానికి వెళ్ళిపోతారు!

అక్కడ తన జన్మకారణాలను మరింత విస్తారంగా తెలుసుకుని మళ్ళీ భూలోక జన్మల ద్వారా జనాలోకానికి చేరుకుంటాడు.

 ‘ఇప్పుడేం చెయ్యాలి?’ అని ఆలోచించుకుంటూ అక్కడ కూర్చున్న అతడు .. సత్యలోకం నుంచి ఒకానొక వెలుగు రూపంలో వచ్చిన మాస్టర్ల నుంచి గొప్ప గొప్ప బోధనలు అందుకుంటాడు. అప్పుడు తాను మళ్ళీ భూలోకానికి వెళ్ళి చెయ్యాల్సిన పనులను గురించి తెలుసుకుని మళ్ళీ ప్రయాణానికి సన్నద్ధం అవుతాడు.

చదువు పూర్తి అయ్యాక బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోన్న ఒకానొక క్లర్క్ .. ‘ఆఫీసర్’ గా ప్రమోషన్ పొందడానికి మళ్ళీ మళ్ళీ ఇన్‌సర్వీస్ పరీక్షలు వ్రాసినట్లు .. వీళ్ళు కూడా తాము ధ్యానం చేసుకుంటూ అనేక మందికి ధ్యానం నేర్పించి .. ఇతర పైలోకాలకు అంటే మహాలోకాలకు వెళ్ళిపోతారు.

అక్కడ ఇంకా గొప్ప జీవిత ప్రణాళికలను రచించుకుని .. మళ్ళీ భూలోకానికి వచ్చి అన్ని లోకాలవాళ్ళతో కలిసి గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టి సత్యలోకానికి చేరుకుంటారు.

ఇలా రకరకాల లోకాల వాళ్ళతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ వారి ఆత్మ పరిణామాన్ని ఉన్నతీకరిస్తూ .. క్రమక్రమంగా సత్యలోకానికి చేరుకుంటారు. అలాంటి వాళ్ళకు ‘అవసరం’ అనుకుంటే తప్ప ఇక మళ్ళీ భూలోకానికి దిగి రావల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వచ్చినా వారు నిర్గుణస్థితిలోనే ఉంటూ అతి ఖచ్చితంగా విశ్వకల్యాణంలో నిమగ్నమై క్రొత్త క్రొత్త ఇతరలోకాలను సృష్టిస్తూ ఉంటారు.

“ఒక్కోసారి వాళ్ళు అక్కడే కూర్చుని కూడా ఇక్కడి కార్యక్రమాలను చక్కబెడుతూనే .. ఇంకా ఇంకా క్రొత్త క్రొత్త లోకాలను సృష్టిస్తూ ఉంటారు! “పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఇలా సత్యలోకవాసులుగా ఉంటూ సృష్టికి ‘ప్రతిసృష్టి’ చేస్తోన్న విశేష ఆత్మలు! వాళ్ళందరికీ నా అభినందనలు!!”