ప్రాపంచిక యోగ్యత

 

“ ‘ప్రాపంచిక యోగ్యత’ అన్నది యోగ శాస్త్ర పరిచయం ద్వారా అంకురీకరించి .. మరి పటిష్ట ధ్యానయోగ సాధన ద్వారానే సంపూర్ణంగా పుష్పించి, ఫలిస్తుంది”

 

నేటి కలలే రేపటి వాస్తవాలకు మూల బీజాలవుతాయి. కలలనేవి కల్లలు కావు …

భవిష్యత్తులో మనకు కావల్సిన వాటిని కావల్సిన విధంగా మనం స్వయంగా తీర్చిదిద్దుకునే సుత్తీ, కొడవళ్ళే నేడు మనం కనే కలలు …

అయితే, కేవలం చక్కటి కలలు కంటే, కేవలం కలలు మాత్రం కంటూనే వుంటూంటే ఏమి లాభం లేదు

మన దేశం స్వర్ణసదృశం కావాలంటే దానికి ఏది కావాలో అది చెయ్యాలి

దేశం అంటే మట్టి కాదు .. ప్రజలు

దేశంలోని ప్రజలు మట్టికొడుతూ వుంటే దేశం కూడా మట్టి కొడుతూనే వుంటుంది. ప్రజలు అయోగ్యులైతే రాష్ట్రం అయోమయంగా వుంటుంది. ప్రజలు యోగ్యులుగా వుంటేనే దేశం స్వర్ణతుల్యమవుతుంది.

“‘ప్రాపంచిక యోగ్యత’ అన్నది యోగ శాస్త్ర పరిచయం ద్వారా అంకురీకరించి .. మరి పటిష్ట ధ్యానయోగ సాధన ద్వారానే సంపూర్ణంగా పుష్పించి, ఫలిస్తుంది”

భౌతికపరమైన శాస్త్రవిజ్ఞానంతో మాత్రమే అయితే “యోగ్యత” అన్నది ఎప్పటికీ సిద్ధించదు ; కేవలం భౌతికపరమైన విజ్ఞానంతో  “యోగ్యత” అన్నది గగన కుసుమమే

మరి ఆధ్యాత్మికపరమైన “ధ్యాన అభ్యాసం” ద్వారానే, “ధ్యాన యోగానుష్టానం” ద్వారానే ప్రజలు యోగ్యులై విలసిల్లగలిగేది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ దేశమైనా  “ధ్యానదేశం” కాకుండా  “స్వర్ణదేశం” కావటం అన్నది అసంభవం.

మొదట అందరూ హింసను వదిలిపెట్టేయాలి, ఎవ్వరికీ మరొకరిని హింసించే హక్కు లేదు. “అహింసా పరమో ధర్మః” అన్నాడు కదా గౌతమ బుద్ధుడు

బుద్ధుడు పుట్టిన దేశంలోనే ఎంత హింసో .. ఇకనైనా హింసను వదిలిపెట్టేద్దాం, ఇకనైనా ‘హంస’ ను పట్టుకుందాం. “హింస” అంటే “జంతువధ” మరి “మాంసభక్షణ”.

మనం అనాది నుంచి భారతదేశంలో “రామరాజ్యం” గురించి వింటూనే వున్నాం. ప్రతి యుగం లోనూ ప్రజలు “రామరాజ్యం” కోసమే కలలు కన్నారు.

“రామరాజ్యం” అంటే ఒక రాముడి లాంటి వాడి చేతిలో నడవబడే రాజ్యం ; ప్రజల యోగక్షేమాల గురించి పూర్తిగా తెలిసివున్న రాజు చేతిలోని రాజ్యం ; ఒక రాజు మహాయోగి అయిన పరిస్థితిలో వున్నటువంటి రాజ్యం. ఆధ్యాత్మికతతోనే పుట్టి, ఆధ్యాత్మికతలోనే పెరిగి ఆధ్యాత్మికత కోసమే జీవించిన యోగి రాజు చేతిలో నడుపబడిన రాజ్యం.

రాముడు వంటి వాడు రాజ్యం యొక్క రాజు కాకపోతే రామరాజ్యం రావడం అనేది అసంభవం.

అందుకే సోక్రటీస్ మహానుభావుడు అన్నాడు – “తత్వవేత్తలే పాలకులు కావాలి” అని.

ప్రజలు రామరాజ్యం కోరుకునేటట్లయితే ఆత్మజ్ఞానులనే పరిపాలకులుగా ఎన్నుకుని తీరాలి ; ప్రజలు మూర్ఖుల్ని ఎన్నుకుంటే ఆ మూర్ఖులు ప్రజల్ని ‘మిరపకాయ బజ్జీ’ లు చేసుకుని తింటారు.

“ప్రజలు వారి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటారు” అన్నది పరమ సత్యం. యథా ప్రజా .. తథా రాజా.

ధర్మరాజ్యం కావాలో, అధర్మ రాజ్యం కావాలో, ఎన్నుకునేది ప్రజలు చేతుల్లోనే వుంది .

“యధా రాజా .. తధా ప్రజా” అనేది అలనాటి సామెత, “యాధా ప్రజా .. తధా రాజా ” అనేది ఇలనాటి సామెత .

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్, ఇండియా .. ప్రజలందరినీ ధ్యాన ప్రజలుగా, ఆత్మజ్ఞాన సంపన్నులుగా తీర్చిదిద్దుతోంది. ఆత్మజ్ఞానులైన ప్రజలు తప్పకుండా ఆత్మజ్ఞానుల్నే నాయకులుగా ఎన్నుకుంటారు.

ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది ; మళ్ళీ “రామరాజ్యం” అంటే “ధర్మరాజ్యం” వచ్చి తీరుతుంది. మళ్ళీ ఈ నవీన యుగంలో – భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా “ధర్మరాజ్యం” అనేది వెల్లివిరుస్తుంది.