“నా గురుదేవులు”

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ ఉద్యమానికి ఆదిదేవులు శ్రీ సదానంద యోగి గారు! ఈ మహాగురువు తమ శిష్యుడు అయిన సుభాష్ పత్రీజీ కోసం అన్వేషిస్తూ అరేబియాదేశం నుంచి భారతదేశం వచ్చి .. కర్నూలులో వారిని కలుసుకున్నారు.

కొన్ని వందల సంవత్సరాలుగా తమలో నిక్షిప్తం చేసుకున్న తమ ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ రెండున్నర సంవత్సరాల పాటు పత్రీజీకి ధారపోసి ఇక తమ కర్తవ్యం పూర్తి అయ్యిందన్నట్లుగా .. 1983 మే 22వ తేదీన ఈ లోకం నుంచి నిష్క్రమించారు. జూలై 27వ తేదీ గురుపౌర్ణమిని కర్నూలు జిల్లా, నందవరం గ్రామంలోని శ్రీ సదానందయోగి గారి మహాసమాధి ప్రాంగణంలో జరుపుకుంటోన్న విశేష సందర్భంగా వారితో బ్రహ్మర్షి పత్రీజీ యొక్క అనుభూతులు పత్రీజీ మాటలలోనే ..

– ఎడిటర్.

శ్రీ సదానంద యోగి గారి పరిచయం నాకు నా స్నేహితులు శ్రీరామచెన్నారెడ్డిగారి ద్వారా లభించింది!

అప్పట్లో నేను కోరమాండల్ సంస్థలోనూ, శ్రీ రామచెన్నారెడ్డి ప్యారీ కంపెనీలోనూ పనిచేసేవాళ్ళం.

నంద్యాల సమీపంలోని ఆత్మకూరు దగ్గరి “రేగడి గూడూరు” అనే గ్రామానికి దగ్గర వున్న ఒక పల్లెకు రామచెన్నారెడ్డి ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు వారు అక్కడ అప్పటికే 90 ఏళ్ళ వయస్సు వున్న శ్రీసదానందయోగి గారి శిష్యుడు శ్రీ “యోగి రామరెడ్డి”గారిని కలిసారట. వారి ద్వారా శ్రీ సదానందయోగి గారి వివరాలన్నీ తెలుసుకుని కర్నూలులో వారు ఉండే అడ్రస్ తీసుకుని నా దగ్గరికి వచ్చారు.

“కర్నూలులో ఒక పెద్దాయనవున్నారు; ఆయనను మనం కలుసుకోవాలి” అంటూ రామచెన్నారెడ్డి నాతో అనగానే .. నేను, రామచెన్నారెడ్డి మరి ప్యారీ కంపెనీ వెంకటరత్నం ముగ్గురం కలిసి వారి దగ్గరికి వెళ్ళాం! ఆ రోజు 1981 జనవరి 1వ తేదీ!

రామచెన్నారెడ్డి తెచ్చిన అడ్రసు ప్రకారం ఆ రోజు ప్రొద్దున్నే 7.30 గం||లకు .. అప్పట్లో కర్నూలు పాత బస్‌స్టాండ్ వెనుక వున్న “రాఘవేంద్ర లాడ్జి”కి వెళ్ళాం. ఆ లాడ్జిలో ఒక చిన్న గదిలో వున్న నలుగురైదుగురు కూర్చోగలిగే మంచం పై వారు పడుకుని వున్నారు.

మేము వెళ్ళేసరికి పడుకునివున్న వారు మా అలికిడి విని కళ్ళుతెరిచి చూసి .. “ఏం కావాలి?” అని అడిగారు గంభీరంగా!

ఇంకా మేము జవాబు ఇచ్చే లోపలే “ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మీకు మరొకటి దొరకదు” అన్నారు! “మాకు కావలసింది కూడా అదే స్వామి! ఇంక వేరే దేనికోసమూ మేము రాలేదు!” అంటూ వినయంతో పలికాం.

సాధారణంగా స్వామీజీల దగ్గరకు పనికిరాని మనుష్యులందరూ వచ్చి “నా కొడుకు ఉద్యోగం అండీ! నా కూతురు పెళ్ళండీ! మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవడం లేదండీ!” అంటూ వారిని నానారకాలుగా విసిగిస్తూ వుంటారు.

పాపం! ఈ స్వామీజీ కూడా అలాగే అందరితో విసిగి, వేసారి పోయివున్నారు కనుక “మాకు బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు స్వామీజీ!” అని మేము చెప్పడంతో ఎంతో సంతోషించి వెంటనే లేచికూర్చున్నారు. ఎంతో ప్రసన్నంగా .. “ఓహో” అంటూ తలపంకించి .. అయిదు, పది నిమిషాల పాటు ఏమీ మాట్లాడలేదు!

ఆ తర్వాత అనర్గళంగా శ్లోకం తర్వాత శ్లోకం అరబిక్ భాషలో, తెలుగులో, అప్పుడప్పుడూ ఇంగ్లీషు ముక్కలతో కలిపి అరగంట సేపు నయాగరా జలపాతంలా తన బ్రహ్మజ్ఞానాన్ని అంతా మా మీద వర్షించారు! అది విన్న నేను .. నా జీవితంలో మొట్టమొదటిసారిగా “పర-వశుడను” అయ్యాను.

ఆ తరువాత “రేపు ఉదయం 4.30 గంటలకు రండి ధ్యానం నేర్పిస్తా!” అన్నారు వారు. 1975లో నేను ఉద్యోగరీత్యా కర్నూలుకు వచ్చాను. సరిగ్గా అదే సంవత్సరంలోనే, స్వామీజీ కూడా కర్నూలుకు వచ్చారు కానీ నేను మాత్రం 1981లోనే స్వామీజీని కలుసుకోవడం జరిగింది. ఒకానొక జన్మలో శ్రీ సదానంద యోగిగారు జీసస్ క్రైస్టు యొక్క గురువుగారైన “జాన్ ది బాప్టిస్ట్” అని నేను తెలుసుకున్నాను.

ఆయన అంతకు ముందు ఆరు సంవత్సరాల నుంచి కర్నూలులోనే వున్నారట. మనకేం తెలుసు? శిష్యుడు ఎదురుగానే వుండొచ్చు .. గురువు ప్రక్కనే వుండచ్చు .. కానీ “గురు శిష్యుల కలయిక జరగడం” అన్నది మాత్రం శిష్యుడు సంసిద్ధుడిగా వున్న తరువాతే జరుగుతుంది. ఆ రోజు నేను సంసిద్ధుడిగా వున్నాను కాబట్టే నాకు వారి దర్శనం లభించింది!

ఆ మహాస్వామి నాకు తెలిసిన మరుక్షణంలోనే, వారి గంభీరమైన వదనం నేను తిలకించిన వెంటనే .. నాకు నేనుగా ఆ మహాస్వామికి “సమర్పణ” అయిపోయాను.

మర్నాడు .. అంటే 1981 జనవరి 2వ తేదీన .. ప్రాతఃకాలం 4.30గంటలకు మళ్ళీ మేము ముగ్గురం త్రిమూర్తులుగా వెళ్ళాం!

మమ్మల్ని “కూర్చోండి” అని చెప్పేసి “చేతుల్లో చేతులు పెట్టండి; కళ్ళు రెండూ మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టండి” అన్నారు. ఇంతే మాకు వారు చెప్పింది! ఏ మంత్రమూ లేదు! ఏ తంత్రమూ లేదు!!ఏ యంత్రమూ లేదు!!!

అప్పటికే నేను ధ్యానజ్ఞానాని! అయితే .. ఈ “శ్వాస మీద ధ్యాస” ధ్యాన విధానం అన్నది మొట్టమొదటిసారిగా ఈ జన్మలో మరొక యోగీశ్వరుడి నోటి నుంచి విన్నాను. అప్పటినుంచి, అంటే 1981 జనవరి 1 వ తేదీ నుంచి శ్రీ సదానంద యోగి గారి దగ్గర నా ఆధ్యాత్మిక శిష్యరికం మొదలయ్యింది!

కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కంపెనీలో రీజనల్ సేల్స్ ఆపీసర్‌గా నా ఉద్యోగరీత్యా నేను మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు .. ఇలా మొత్తం ఆరుజిల్లాలు తిరుగుతూండేవాడిని. నెలకు 25 రోజులు టూర్‌లోనే ఉంటూ 5,6 రోజులు మాత్రం కర్నూలులో ఉండేవాడిని.

అంతకు ముందు కర్నూలులో వున్నన్ని రోజులు “అగ్రి ఫ్రెండ్స్ క్లబ్”కు వెళ్ళి పేకాడేవాడిని. ఇక సదానంద యోగిగారినీ కలిసిన తరువాత నుంచి ఈ క్లబ్ బంద్!! పేకాట బంద్!!! అన్నీ బంద్!!! ఎంతో ఆర్తిగా వెళ్ళి స్వామీజీ దగ్గర కూర్చునేవాళ్ళం .. ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునేవాళ్ళం.

శ్రీ సదానంద యోగిగారు సిగరెట్ మీద్ సిగరెట్ కాలుస్తూండేవారు! మేము ఆయనకు ప్రతిరోజూ రెండు సిగరెట్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళం! ‘చాయ్’ త్రాగుతూ సిగరెట్ త్రాగుతూ వారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక జీవిత సత్యాలను మాకు అనర్గళంగా చెబుతునే వుండేవారు.

ఆయనది “అచల సిద్ధాంతం” .. శ్రీ శివరామ దీక్షితులు అంటే వారికి ఎంతో మక్కువ .. ఎప్పుడూ వారు దీక్షితులు గారి సూక్తులను విశేషంగా చెప్పేవారు.

ఆయనకు అరబిక్ భాష అనర్గళంగా వచ్చు! ఆ భాష వారి నోటి ద్వారా, ఎంతో వినసొంపుగా వుండేది! వారి నోటి నుంచి వచ్చే “సుభాష్” అన్న పిలుపు నాకు ఎంత మధురంగా వుండేదో చెప్పనలవి కాదు!!

వారికి కేవలం కొంతమందే శిష్యులు ఉండేవారు! మిగతా వారేమో భక్తులు! ఆత్మజ్ఞానానికీ, ధ్యానానికీ వచ్చే శిష్యులు – కేవలం ఒక నలుగురైదుగురు నేను, రామచెన్నారెడ్డి, వెంకటరత్నం, జనార్ధనరావు, సూర్యమోహన్!

మా ధ్యానజ్ఞానసాధనలు ఇలా జరుగుతూ వుండగా .. 1982వ సంవత్సరంలో హెడ్ ఆఫీస్ నుంచి “నువ్వు సీనియర్ మోస్టువి; హెడ్ ఆఫీసుకు రావాలి; కనుక నిన్ను హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం” అని పిలుపువచ్చింది.

“నేను రాను” అని వారికి ఖచ్చితంగా చెప్పాను! నా గురువుగారు ఇక్కడ వుంటే నాకు హైదరాబాద్‌లో ఏం పని?

హైదరాబాద్‌లో మా తల్లిగారు వున్నారు; తండ్రిగారు వున్నారు; స్వంత ఇల్లు వుంది. నిజానికి అక్కడికి పోతే నాకు ఎంతో సుఖంగా వుంటుంది .. మరి నెలకు రెండు వేలు రూపాయలు కూడా మిగులుతాయి. కానీ వీటన్నింటిని మించిన పెన్నిధి .. నాగురువుగారు ఇక్కడ వున్నారు కనుక “నేను కర్నూలు వదలను” అని నిశ్చయించుకుని “నాకు మీ ప్రమోషనూ వద్దు .. ఏమీవద్దు! నేను కర్నూలులోనే వుంటాను!” అని మా ఆఫీసువాళ్ళకు తేల్చిచెప్పాను.

“సరే” అన్నారు మా ఆఫీసు వాళ్ళు ..

మళ్ళీ 1983లో “ఈసారయినా రావయ్యా .. హైదరాబాద్‌కు! హెడ్ ఆఫీసులో నీ అవసరం వుంది!” అన్నారు.

“నేను రాను” అని మళ్ళీ చెప్పాను.

పాపం మా ఆఫీస్‌వాళ్ళు చాలా చాలా మంచివారు! “సరే” అని నన్ను నా ఇష్టానికే వదిలేశారు.

1983 .. ఏప్రిల్ 16వ తేదీన నా గురువు శ్రీ సదానంద యోగిగారు నన్ను పిలిచి “సుభాష్! నేను శరీరం వదిలి వేయాలని నిశ్చయించుకున్నాను; నువ్వు నా కోసం సమాధిని సిద్ధం చెయ్యి” అని ఆదేశం ఇచ్చారు.

“సరే స్వామీ” అని చెప్పి .. కర్నూలు పట్టణం చుట్టూ స్థలం కోసం వెతికాము. ఎక్కడా మాకు సంతృప్తికరమైన స్థలం దొరకలేదు! చివరికి “చెన్నారెడ్డి” అనే స్వామీజీ భక్తుడు ఒకరు “బనగానపల్లి దగ్గర వున్న ‘నందవరం’ గ్రామంలో వున్న నా పొలంలో గురువుగారికి సమాధి ఏర్పాటుచేస్తే బాగుంటుంది” అన్నాడు.

వెంటనే రామచెన్నారెడ్డి, నేను కలిసి నందవరం వెళ్ళాం! అక్కడ నాకు బాగా అనిపించి .. ఒక స్థలాన్ని ఎంపిక చేసి .. ఆ స్థలాన్ని అంతా త్రవ్వి చదునుచేసి .. గురువుగారి ఆజ్ఞమేరకు సమాధిని సిద్ధం చేసాం.

“స్వామీజీ తాము చెప్పిన సమయం ప్రకారం తమ శరీరాన్ని వదిలిపెట్టేస్తే పోలీసులతో ఏం ఇబ్బంది వస్తుందో అని నేను నా సంగీత గురువు మరి గొప్ప డాక్టర్ అయిన డా|| శ్రీపాద పినాకపాణి గారిని కలిసి .. “శ్రీ సదానంద యోగిగారు తమ శరీరాన్ని వదిలి పెట్టేస్తున్నారు; మీరు వచ్చి ఆయనను పరీక్షించి ఆఖరి శ్వాస చూసి ‘ఇక శ్వాస లేదు’ అని రికార్డు చేయండి” అని కోరాను. వారు వచ్చి అలాగే రికార్డు చేయగా నిబంధనల ప్రకారం అంతా సజావుగా జరిగిపోయింది.

తర్వాత శ్రీ సదానంద యోగి గారి పార్థివ శరీరాన్ని నందవరం తీసుకెళ్ళి అక్కడ మేము సిద్ధం చేసి వుంచిన సమాధిలో పెట్టి .. పై నుంచి ఒక రాయిని కప్పాం! ఇలా 1983 మే 22 వ తేదీన వారు తమ తనువును చాలించారు. వారు తమ సమాధిని నందవరంలో ఏర్పాటు చేయమని మాకు సూచించిన తరువాత రెండు మూడు సార్లు సశరీరంగా ఆ గ్రామంలోని ఒక రైతుకు దర్శనం ఇచ్చారట! పోల్చి చూసుకుంటే సరిగ్గా ఆ రైతు చెప్పిన సమయాలలో వారు కర్నూలులోని రాఘవేంద్ర లాడ్జిలోనే మాలో ఎవరో ఒకరి సమక్షంలోనే వున్నారు. అంత గొప్ప సిద్ధపురుషులాయన!

ప్రతి సంవత్సరం మే 22 వ తేదీన శ్రీ జనార్ధనరావుగారు వెళ్ళి ఆ రోజంతా అక్కడే వుండి .. సమాధి ప్రదేశాన్ని అంతా శుభ్రం చేసేవారు. ఈ మధ్యనే శ్రీ జనార్దనరావు గారు శరీరాన్ని వదిలేసారు. ప్రతి పౌర్ణమి నాడు కర్నూలు జిల్లా పిరమిడ్ ధ్యానులందరూ నందవరం వెళ్తూనే వుంటారు.

సదానందయోగి తర్వాత అంతటి మహాపురుషులు కాశిరెడ్డి నాయన! వారు ఒకే సమయంలో అయిదు చోట్ల తమ భౌతిక శరీరంతో దర్శనం ఇవ్వగలిగేవారు వారు! కాశిరెడ్డినాయన కర్నూలు ధ్యాన కేంద్రానికి ఎన్నోసార్లు వచ్చి పిరమిడ్‌లో ధ్యానం చేసుకున్నారు.

నా జీవితంలో తారసపడ్డ ఇద్దరు అద్భుతమైన మాస్టర్స్ .. శ్రీ సదానంద యోగి మరి శ్రీ కాశిరెడ్డి నాయనగార్లకు గురుపౌర్ణమి సందర్భంగా నా వినయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను!!