“మహాకరుణ మహాయజ్ఞం – సర్వమత సమ్మేళనం”

బ్రహ్మర్షి పితామహ పత్రీజీ జన్మదిన వేడుకలు

“పత్రీజీ సందేశం”

“నేను ఈ జన్మలో ‘శ్రీమతి సావిత్రీ దేవి’ మరి ‘శ్రీ రమణారావు’ దంపతుల సంతానంగా హిందువుల ఇంట్లో పుట్టాను. గత జన్మలో నేనొక ముస్లింను. అప్పుడు నా పేరు ‘ఇనాయత్ ఖాన్’. నాలాగే అందరూ కూడా ఎన్నో ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ కొన్ని జన్మలలో హిందువులుగా .. కొన్ని జన్మలలో ముస్లింలుగా .. మరికొన్ని జన్మలలో క్రిస్టియన్‌లుగా .. ఇంకా ఈ భూమి మీద ఏఏ మతాలు ఉన్నాయో అన్ని మతాలలోనూ పుడుతూ ఆ యా మతాల జ్ఞానాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు.

“ఆడమనిషిగా .. మగ మనిషిగా .. ఆస్తికులుగా .. నాస్తికులుగా కొన్ని వందల జన్మలు పుట్టి ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ‘బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మామ్ ప్రపద్యతే’ అని భగవద్గీతలో చెప్పినట్లు ఎన్నో జన్మల తరువాత ‘నేను శరీరం కాదు; ఆత్మ’ అనీ .. ‘ప్రతి జన్మ కూడా అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికే ఉంటుంది’ అనీ తెలుసుకుంటాం!

“బీదగా కొన్ని, ధనికులుగా కొన్ని సమస్యలతో కొన్ని, సమస్యలు లేకుండా కొన్ని, ఇలా .. రోగిగా, భోగిగా మరి చివరికి యోగిగా పరిణితి చెందేంతవరకు జన్మ పరంపర సాగుతూనే ఉంటుంది! ధ్యానం చేసి ఆత్మయోగిగా మారేంత వరకు ఈ ‘రాకపోకలు’ కొనసాగుతూనే ఉంటాయి. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ధ్యాన యోగులందరికీ నా నమస్కారాలు” అని తెలియజేశారు.