భగవద్గీత 3-10

“ సహయజ్ఞాః ప్రజాఃసృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |

అనేన ప్రసవిష్యధ్వ మేషవోస్త్విష్టకామధుక్ ||

 

పదచ్ఛేదం

సహయజ్ఞాః – ప్రజాః – సృష్ట్వా – పురా – ఉవాచ – ప్రజాపతిః – అనేన – ప్రసవిష్యధ్వం – ఏషః – వః – అస్తు – ఇష్టకామధుక్

ప్రతిపదార్ధం

ప్రజాపతిః = బ్రహ్మ ; పురా = కల్పారంభంలో ; సహయజ్ఞాః = యజ్ఞంతో కూడిన ; ప్రజాః = ప్రజల్ని ; సృష్ట్వా = సృష్టించి ; ఉవాచ = చెప్పాడు ; అనేన = ఈ యజ్ఞం ద్వారా ; ప్రసవిష్యధ్వం = అభివృద్ధిని పొందండి; ఏషః = ఈ యజ్ఞం ; వః = మీకు ; ఇష్టకామధుక్ = కోరుకున్న భోగాలు ప్రదానం చేసేదిగా ; అస్తు = అవుతుంది.

తాత్పర్యం

“ కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలనూ ‘యజ్ఞ’ సహితంగా సృష్టించి వాళ్ళతో ‘మీరూ యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుంది’ అని చెప్పాడు ! ”

వివరణ

ప్రతి అంశాత్మా ఒకానొక పూర్ణాత్మ నుంచి ఉద్భవిస్తుంది !

ప్రతి పూర్ణాత్మా తన స్వీయశక్త్యానుసారం అంశాత్మలను సృష్టిస్తూ ఉంటుంది !

 మహాశక్తివంతమయిన పూర్ణాత్మలు జీవాత్మలను

‘ వర్షం ’లా కూడా కురిపిస్తూ ఉండవచ్చు.

అంశాత్మ “ ప్రజ ” అనబడుతుంది !

పూర్ణాత్మ “ ప్రజాపతి ” అనబడుతుంది !

సృష్టిలో కోటానుకోట్ల ప్రజాపతులున్నారు.

ప్రతి ప్రజాపతి కూడా “ ఒకానొక బ్రహ్మ ” … అంటే “ ఒకానొక సహ సృష్టికర్త ”.

ఏ ప్రజాపతి అయినా తన కోసం సృష్టి చేయడు …

లోకకళ్యాణం కోసమే సృష్టి జరిగేది !

అంటే ప్రతి అంశాత్మ పుట్టుక ‘ కర్మ ’ లోంచి జరగదు …

“ యజ్ఞం ” లోంచి జరుగుతుంది !

జీవాత్మలకు పూర్ణాత్మలు ఇచ్చే సందేశం ఏమిటి ?

“ మీరు కూడా మాలాగే ‘ యజ్ఞాలు ’ చేసి అభివృద్ధిని పొందండి ! ”

“ ‘కర్మలను’ చేస్తూ అభివృద్ధిని పొందకుండా ఉండవద్దు ! ”

“ యజ్ఞాచరణ ద్వారానే కోరుకున్న భోగాలు సిద్ధిస్తాయి …

కర్మాచరణ ద్వారా కాదు ”… అని.