భగవద్గీత 3-17

“ యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః |

ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ||


పదచ్ఛేదం

యః – తు – ఆత్మరతిః – ఏవ – స్యాత్ – ఆత్మతృప్తః – చ – మానవః – ఆత్మని – ఏవ – చ – సంతుష్టః – తస్య – కార్యం – న – విద్యతే

ప్రతిపదార్ధం

తు = కానీ ; యః = ఏ ; మానవః = మానవుడు ; ఆత్మరతిః ఏవ = ఆత్మలోనే రమిస్తూ ; చ = మరి ; ఆత్మతృప్తః = ఆత్మలోనే తృప్తి పొందుతూ ; చ = మరి ; ఆత్మని, ఏవ = ఆత్మలోనే ; సంతుష్టః = సంతోషిస్తూ ; స్యాత్ = వుంటాడో ; తస్య = వానికి ; కార్యం = చేయవలసిన కర్తవ్యం ; న విద్యతే = ఏదీ వుండదు.

తాత్పర్యం

“ ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో … అలాంటి ఆత్మజ్ఞానికి … ఇంక చేయవలసిన కర్తవ్యం ఏదీ వుండదు. ”

వివరణ

“ భౌతిక క్షేత్రం ”, “ ప్రాణశక్తి క్షేత్రం ”, “ భావనా క్షేత్రం ”, “ ఆత్మక్షేత్రం” …

ఈ నాలుగు క్షేత్రాలలో ప్రథమమైన మౌలికమైన క్షేత్రం … ఆత్మక్షేత్రం !

ఇది తెలుసుకున్న వాళ్ళనే “ ఆత్మజ్ఞానులు ” అంటాం.

వాళ్ళకు “ వేరే చేయవలసిన కార్యం ” అంటూ ఏదీ ఉండదు !

వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ వుంటారు; 

వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ వుంటారు;

వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ వుంటారు;

కేవలం భౌతికక్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు

ఎప్పుడూ అసలు తృప్తిని పొందలేరు !

భౌతికక్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు

ఎప్పుడూ శాశ్వత సంతోషాన్ని పొందలేరు !

ఆదిశంకరాచార్యుల వారు కూడా అన్నారు కదా …

“ యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి ఏవ ” …

“ ఎవరైతే ఎప్పుడూ ఆత్మ క్షేత్రంలోనే సదా క్రీడిస్తూ వుంటారో …

వారికే ఆనందం … ఆనందం … ఆనందం ” అని !