భగవద్గీత 3-11

“ దేవాన్భావయతానేన తే దేవా భావయంతు వః |

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ||

 

పదచ్ఛేదం

దేవాన్ – భావయత – అనేన – తే – దేవాః – భావయంతు – వః – పరస్పరం – భావయంతః – శ్రేయః – పరం – అవాప్స్యథ

ప్రతిపదార్థం

అనేన = ఈ యజ్ఞం ద్వారా ; దేవాన్ = దేవతల్ని ; భావయత = ఉన్నతులుగా ; తే, దేవాః = ఆ దేవతలు ; వః = మిమ్మల్ని ; భావయంతు = ఉన్నతులుగా చేస్తారు ; పరస్పరం = ఒకరినొకరు ; భావయంతః = ఉన్నతులుగా తయారుచేసుకొన్నవారై ; పరం = ఉత్కృష్టమైన ; శ్రేయః = శ్రేయస్సును ; అవాప్స్యథ = పొందుతారు

తాత్పర్యం

“ మీరందరూ ఈ ‘యజ్ఞం’ ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే, ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు ; ఈ ప్రకారంగా ఒకరికొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. ”

వివరణ

రెండు లోకాలు ఉన్నాయి !

ఒకటి … దేవతల లోకం ! రెండు … మానవుల లోకం !

దేవతల లోకం దివ్యచక్షువుకే కనబడుతుంది !

అయితే, దివ్యలోకవాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు !

మానవుల యజ్ఞకార్యక్రమాలు దేవతలను

అమితంగా సంతోషపరుస్తూ వుంటాయి !

మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలను దుఃఖపెడుతూనే ఉంటాయి !

సంతోషం ఎప్పుడూ ఆత్మలను ఉన్నత పరుస్తుంది ;

దుఃఖం ఆత్మలను ఎప్పుడూ కృశింప చేస్తుంది.

ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞకార్యక్రమాల ద్వారా సంతోషంగా వుంటారో

అప్పుడు వారు మరింతగా మానవలోకాలకు సహాయం చేస్తారు.

మానవుల ద్వారా దేవతలూ, దేవతల ద్వారా మానవులూ …

పరస్పరం ఒకరినొకరు ఉన్నత పరచుకుంటూ ఉంటారు … యజ్ఞాల ద్వారా

యజ్ఞరహిత కర్మల ద్వారా … రెండు లోకాలూ విడిపోయి ఉంటాయి ;

యజ్ఞాల ద్వారానే రెండు లోకాలూ చేదోడు వాదోడుగా ఉంటాయి !