“ధ్యానానుభవాలు”

“ధ్యానం చేయడం ఏలాగ? ధ్యానం అంటే ఏమిటి?

” ధ్యానం అంటే మన మనస్సుని ఖాళీ చేసుకోవడం . “యోగః చిత్తవృత్తి నిరోధః “. దానికి మార్గం ఏమిటి? – “శ్వాస మీద ధ్యాస”, హాయిగా కూర్చుని కాళ్ళు రెండూ కట్టేసుకుని, చేతులు రెండూ కట్టేసుకుని, నోరు కట్టేసుకుని, కళ్ళు రెండూ కట్టేసుకుని, మస్తిష్కాన్ని “స్విచ్ ఆఫ్ ” చేసుకుని, శ్వాస మీద ధ్యాస ఉంచితే చక్కగా ఆలోచనా-రహిత – స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి.

కళ్ళు రెండూ మూసేసుకోగానే ధ్యానానుభవాలు రావు. మొదట్లో రకరకాల ఆలోచనల పరంపర మొదలవుతుంది. ఏంతో సేపటికికానీ ఆ ఆలోచనల పరంపర శమించదు. ఆలోచనలు వస్తూంటాయి…., పోతుంటాయి… వాటిని ఎప్పటికప్పుడు ‘ కట్ ‘ చేసేసి మళ్ళీ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూండగా ఆ ఆలోచనల పరంపర యొక్క ప్రెజర్ తగ్గుతుంది. ఒక్కొక్క ఆలోచనా మటుమాయమై పోతూ చివరకి ఆలోచనా-రహిత-స్థితి వస్తుంది. వెన్ ద మైండ్ బికమ్స్ ఎమ్టీ …. అప్పుడు ధ్యానానుభవాలు మొదలవుతాయి. ఎప్పుడయితే ధ్యానస్థితిలోకి వెళ్తామో – అంటే ఇక్కడ ఆలోచనా – రహిత – స్థితే ధ్యానస్థితి – అప్పుడు ధ్యాననుభవాలు మొదలవుతాయి. అంతవరకూ మనం ప్రాణాయామ స్థితి – అంటే “శ్వాస మీద ధ్యాస” పెడుతూ వున్న స్థితిలో వుంటాం. ఏదేని సుఖమయ ఆసనంలో కూర్చుని ఈ సుఖమయ ప్రాణాయామాన్ని ఆచరిస్తూ ఉంటే, ‘ఆనాపానసతి’ ఆచరిస్తూ వుంటే, అంటే ధ్యానంలో ఉంటూ ఉంటే – మనకు రకరకాల అనుభవాలు మొదలవుతాయి. అంతర దృశ్యాలు కనపడతాయి. అంతర్ నాదాలు, ధ్వనులు, శబ్దాలూ వినబడతాయి. అంతర్ యానాలు చేస్తాం – వీటన్నిటినీ వెరసి ” ధ్యానానుభవాలు ” అంటాం.

ప్రాథమిక ధ్యానానుభవాలు

ఈ ‘ఆనాపానసతి’ మీద దృష్టి కేంద్రీకరించగా మెల్లి మెల్లిగా ఆలోచనలన్నీ శమించిపోతాయి. ఆలోచనలన్నీ జీరో అయినప్పుడు, శూన్యమై పోయినప్పుడు, అప్పుడు ఆ స్థితిలో మొదలవుతాయి ధ్యానానుభవాలు. ఇప్పుడు మనం ఈ ధ్యానానుభవాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ప్రాథమికంగా అంటే … మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చున్న వాళ్ళకి, వెంటనే కానీ, కొన్ని గంటలలో కానీ, కొన్ని రోజులలో కానీ ఏడు రకాలైన … అనుభవాలు వచ్చి తీరుతాయి. ఏడు రకాలైన ప్రాథమిక అనుభవాలను గురించి ముందుగా తెలుసుకుందాం.

ప్రాథమికంగా ఏడు రకాల అనుభవాలు కలుగుతాయి, అందులో

1. శరీరం తేలికగా అయిపోవడం

శరీరం తేలికగా అయిపోవడం, ఎవరి వయస్సు ఎంత ఉంటుందో అన్ని నిముషాలు అంటే పదేళ్ళ పిల్లలు పది నిమిషాలు, అరవై ఏళ్ళ వారు అరవై నిమిషాలు ధ్యానం చేస్తే, ముందు శరీరం బాగా తేలికగా అయిపోతుంది. శరీరం అసలు ఉందో లేదో అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఇది మొట్టమొదటి ధ్యానానుభవం – “ద హోల్ బాడీ బికమ్స్ వెరీ వెరీ లైట్ “.

2. శరీరం బరువుగా అయిపోవడం

ధ్యానంలో ఉండగా, తల భాగం కానీ, శరీరంలోని ఏ ఇతర భాగం గానీ ఒక ‘ గ్రానైట్ రాయి’ లాగా బరువుగా అయిపోతుంది. తల కానీ మొత్తం శరీరం కానీ, – ఇది రెండవ అనుభవం.

మొట్టమొదటిది శరీరం తేలికగా అయిపోవడం, శరీరం బరువుగా అయిపోవడం.

3. రకరకాల రంగులు కనపడతాయి

రకరకాల రంగులు కనపడతాయి, చిత్ర విచిత్రాలయిన రంగులు కనపడతాయి. అంతకుముందు ఎప్పుడూ చూడని అద్భుతమైన రంగులు మన పాలభాగంలో మనకు కనపడతాయి. దీనినే మనం “దివ్యచక్షువు ఉత్తేజితం కావడం” అని అంటాం. కళ్ళు రెండూ మూసుకున్నప్పుడు మనలోని శక్తి అంతా మన యొక్క పాలభాగంలో ప్రసరించి అక్కడ ఉండే మూడవ కన్నును ఉత్తేజితం చేస్తుంది. టి.వి. స్విచ్చ్ ఆన్ చేసిన వెంటనే మనకు రంగులు ఎలా కనిపిస్తాయో అలాంటిదే ఈ మూడవ రకం అనుభవం కూడా. చాలా రంగులు కనపడతాయి. మనకి ఏ, ఏ రంగులు కనపడుతున్నాయో … వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ధ్యానంలో ఏ, ఏ అనుభవాలు కలుగుతాయో … వాటితో ఏకత్వం పొందుతూ వాటిని పరీక్షగా గమనిస్తూ … వీక్షిస్తూ … ఉండాలి. ప్రాపంచిక ఆలోచనలను ‘కట్’ చేసేస్తూ ఉండాలి. “నేనొక భర్త” అనీ, “తల్లి” అనీ, “తండ్రి” అనీ, “కూతురు” అనీ, “అన్న” అనీ, “ప్రైమ్ మినిస్టర్ ” అనీ, బస్ కండక్టర్ అనీ, ఇవన్నీ తీసేస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ఉండగా, కనీస సమయంలో కూర్చోగా, కూర్చోగా మైండ్ శూన్యమైపోగా ఈ ధ్యానానుభవాలు మొదలవుతాయి.

మొట్టమొదటి అనుభవం శరీరం తేలికగా అయిపోవడం, రెండవ అనుభవం శరీరం బరువుగా కావడం, మూడవ అనుభవం రకరకాల రంగులు కనపడడం, ఇకపోతే,

4. శరీరంలోని అన్ని భాగాలలో ముఖ్యంగా వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి.

శరీరంలోని అన్ని భాగాలలో, అన్ని అంగాలలో ముఖ్యంగా, వెన్ను భాగంలో విపరీతమైన నొప్పులు వస్తాయి. ఎంతగా నొప్పులు వస్తాయంటే – ఎప్పుడు కళ్ళు తెరిచేద్దామా, ఎప్పుడు “ఓ.కె” చెప్తారా అని ఎదురు చూస్తూంటామన్నమాట. ఆ బాధలను భరించలేక, ఒంట్లో అంతా ఎన్ని బాధలు వచ్చినా, ఈ నొప్పులన్నింటినీ ఓపిగ్గా భరిస్తూ ధ్యానంలో ఉండాలి. ఈ నొప్పులను భరించే శక్తిని ‘తితీక్ష’ అని అన్నారు ఆదిశంకరాచార్యులవారు.

‘సమము’, ‘దమము’, ‘తితీక్ష’, ‘ఉపరతి’, ‘శ్రద్ధ’, ‘సమాధాన’, అని షట్ సంపత్తులను ఆయన వివరించారు. ముముక్షువు కాదలచుకున్నవాడు షట్ సంపత్తులను కలిగి ఉండాలి.

‘సమము’, ‘దమము’, ‘తితీక్ష’, ఈ మూడవదే తితీక్ష. ధ్యానంలో మరి రకరకాల నొప్పులొస్తున్నాయని చెప్పి వెంటనే కళ్ళు తెరిచేయకూడదు. ఎంతసేపు కూర్చోవాలో … అంతసేపూ కూర్చునే తీరాలి – ఎంత నొప్పి కలిగినా సరే, ఎంత కష్టమైనా సరే – కష్టం లేకుండా ఫలం లేదు కదా … కష్టేఫలే. కనుక ఎన్ని నొప్పులొచ్చినా కూడాను భరించాలి. ఈ నొప్పులు ఎందుకొస్తున్నాయి? అక్కడ నాడీమండలం శుద్ధి జరగడం వలన ఈ నొప్పులు వస్తాయి.

ఎప్పుడైతే కళ్ళు రెండూ మూసుకుంటామో శ్వాస మీద ధ్యాస పెడతామో, మనస్సును ఎప్పుడైతే శూన్యం చేస్తామో అప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తూంటుంది. ఆ యొక్క విశ్వశక్తి ప్రవాహంలో మన యొక్క నాడీమండలం అపరిశుభ్రమైన నాడీమండలం పరిశుభ్రమవుతూంటుంది. అలాంటప్పుడు ఎన్నో నొప్పులొస్తుంటాయి. ఆ నొప్పులన్నింటినీ భరించాలి. అయితే, ఒకానొక పరిశుద్ధ ఆత్మగల వ్యక్తి ధ్యానంలో కూర్చుంటే ఏ విధమైన నొప్పులూ రావు, ఎంచేతనంటే పరిశుభ్రమైన నాడీమండలం ఉంటుంది కనుక. నాడీమండలం ఎంత అపరిశుద్ధంగా ఉంటే అంత ఎక్కువగా నొప్పులు వస్తాయి. గత జన్మల్లో ఎంత ఎక్కువగా పాపాత్ములు అయితే, అంత ఎక్కువగా ఈ నొప్పులు వస్తాయి. ఈ జన్మలో ధ్యానం మొదలుపెట్టినప్పుడు, ఒకవేళ ఆ నొప్పులతో గనక మనం ఆ పాపాలను పరిహారం చేసుకోకుండా ఉంటే, అవి రకరకాలైన భయంకర ధీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. “పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే” కనుక, ఆ పాప ప్రక్షాళన జరిగి మనకి నాడీమండలం శుద్ధి జరిగుతుంది. అప్పుడు మనకు ఎన్నో రకాల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులన్నింటినీ హాయిగా భరించాలి. పాప ప్రక్షాళన జరిగితే గానీ మన యొక్క ఆ దివ్యచక్షువు ఉత్తేజితం కాజాలదు.

కనుక, నాల్గవ అనుభవం ఏమిటంటే, మనకి రకరకాల నొప్పులు వస్తాయి. కాళ్ళు, చేతులూ, వెన్ను ఇలా రకరకాల నొప్పులు వస్తాయి, అయితే ఈ నొప్పులన్నీ మనం ధ్యానంలో ఉన్నంతసేపు మాత్రమే ఉంటాయి. ధ్యానం లోంచి లేవగానే ఈ నొప్పులేవీ ఉండవు. వీటి కోసం ఏ డాక్టరు దగ్గరికీ పోవద్దు. డాక్టర్స్ దగ్గరికి అసలు ఎప్పుడూ వెళ్ళకూడదు. మనకు ఈ ధ్యానంలో వచ్చే నొప్పులు, బాధలు ధ్యానం ద్వారానే పోతాయి.

5. లోపల మరొక సూక్ష్మ శరీరం ఉంది; అది విపరీతంగా డ్యాన్సులు చేయడం మోదలుపెడుతుంది

మనం మన యొక్క ఈ స్థూల శరీరం కదలకుండా నిశ్ఛలంగానే కూర్చుంటున్నాం. కానీ లోపల మరొక సూక్ష్మశరీరం ఉంది. అది విపరీతంగా డ్యాన్సులు చేయడం మొదలుపెడుతుంది. ముందుకీ, వెనక్కీ ఊగిసలాడుతూంటుంది. లోపల గిర్రున తిరుగుతూంటుంది. ఆ అనుభవం మనకి వస్తుంది. ఇది అయిదవ అనుభవం. లోపల వున్న సూక్ష్మశరీరం ఈ స్థూలశరీరం నుండి విడివడడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగి తిరిగి అపకేంద్ర బలాన్ని Centrifugal Force ఆపాదించుకుంటుంది.

6. గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది

సూక్ష్మశరీరం స్థూలశరీరంలో బాగా తిరిగి తిరిగి దాంట్లోంచి బయటికి వచ్చేసి … ఎక్కడికో దూరంగా వేళ్ళిపోయినట్లు మనకు అనుభవం అవుతుంది. ఈ అనుభవమే ఆరవ ధ్యానానుభవం. ఎక్కడో గాలిలో ఎగిరిపోతున్న పక్షిలా, మనం కూడా ఎక్కడికో ఎగిరిపోతున్న అనుభవం కలుగుతుంది. మనం ఇక్కడ లేం; వేరెక్కడో ఉన్నామనే అద్భుతమైన అనుభవం మనకు వస్తుంది.

7. దివ్యచక్షువు తెరుచుకుంటుంది, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలనెన్నిటినో మనం చూస్తాం

చిట్టచివరి ఏడవ అనుభవం ఏమిటంటే, దివ్యచక్షువు తెరుచుకుంటుంది. ఉత్తేజితం కావడం జరిగిన తరువాత ఇప్పుడు ’పూర్తిగా తెరుచుకోవడం’ అన్నమాట. దివ్యచక్షువు తెరుచుకున్నప్పుడు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూస్తాం. అక్కడ ఆ దృశ్యంలో మనం ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఆ నీళ్ళల్లో మనం వున్నట్లుగా చూడవచ్చు లేదా మనం పైన వుండి క్రింద వీటన్నిటినీ చూడవచ్చు.

మోత్తం మీద రకరకాల ప్రకృతి దృశ్యాలను మనం చూస్తాం. ఏ దృశ్యాలను చూస్తున్నామో, ఏ కొండను చూస్తున్నామో, ఏ చెట్టుని చూస్తున్నామో, ఏ జలపాతాన్ని చూస్తున్నామో, దాన్ని చక్కగా గమినిస్తూ ఉండాలి. ఇదే ఏడవ అనుభవం.